పాట్నా, ఆగస్టు 28: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో బీహార్లో సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని ఉపసంహరించుకోవాలని మహాగట్ బంధన్ పార్టీల నేతలు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. అధికార పార్టీల నేతలు ఈ అభ్యర్థన చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. సాధారణ అనుమతి ఉపసంహరించుకుంటే రాష్ర్టాల అధికార పరిధిలోని కేసుల్లో విచారణ చేయాలంటే సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటు ంది. ఆర్జేడీ నేత శివానంద్ తివారీ మాట్లాడుతూ..
బీజేపీ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వసనీయత కోల్పోయాయని విమర్శించారు. సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకోవడానికి ఇదే సరైన సమయమని రాష్ట్ర మంత్రి, జేడీయూ నేత మదన్ సాహ్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీబీఐ అధికారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు కూడా కోరారు. సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని ప్రారంభించిందని ఆర్జేడీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
9 రాష్ర్టాల్లో ఉపసంహరణ
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-1946లోని సెక్షన్ 6 ప్రకారం.. రాష్ర్టాల అధికార పరిధిలోని కేసులను దర్యాప్తు చేయాలనుకుంటే సీబీఐ ఆయా రాష్ర్టాల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. సీబీఐకి సాధారణ అనుమతిని ఇప్పటి వరకు తొమ్మిది రాష్ర్టాలు ఉపసంహరించుకున్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, చత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, జార్ఖండ్, మిజోరాం, మేఘాలయ ఉన్నాయి.