CM Bhupesh Baghel | న్యూఢిల్లీ, నవంబర్ 5: మహదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల కేసులో ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. యాప్ యజమానిగా భావిస్తున్న శుభమ్ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్ చిక్కుల్లో పడ్డారు. తనకు, బఘేల్కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించమే కాక, బఘేల్కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యూఏఈ వెళ్లిపొమ్మని భూపేశ్ బఘేలే తనకు సలహా ఇచ్చారని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ను చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల కోసం మహదేవ్ యాప్ నిర్వాహకుల నుంచి బఘేల్కు రూ.508 కోట్ల ముడుపులు అందినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
బఘేల్తో లింక్ నిజమే
ఈ కేసులో ప్రధాన నిందితుడైన శుభ్మన్ సోని దుబాయ్ నుంచి వీడియో విడుదల చేశారు. అందులో సీఎం బఘేల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. బఘేలే తనను దుబాయ్ పారిపొమ్మని సలహా ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. తానే మహదేవ్ యాప్కు అసలైన యజమానినని, ఈ యాప్ ద్వారా వందలాది కోట్లను ఆర్జిస్తుండటంతో, చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి నుంచి రక్షణకు నేతలను ఆశ్రయించామని చెప్పారు. అందులో భాగంగానే బఘేల్కు పెద్దమొత్తంలో ముడుపులు అందజేసినట్టు తెలిపాడు.
ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై నిఘా ఉంచాయన్నారు. కాగా, ఇటీవల ఆసిమ్ దాస్ అనే కొరియర్ నుంచి ఈడీ 5.39 కోట్లను స్వాధీనం చేసుకుంది. సీఎం బఘేల్ కోసం ఆ మొత్తాన్ని తనకు దుబాయ్ నుంచి శుభమ్ సోని పంపినట్టు ఆయన ఈడీ వద్ద అంగీకరించాడు. దీంతో అతని సెల్ఫోన్, శుభ్మన్ సోని నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ పరిశీలించగా, ఇప్పటివరకు మహదేవ్ యాప్ ప్రమోటర్ల నుంచి బఘేల్కు రూ.508 కోట్లు ముడుపులుగా అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.