Kumbh Mela | ప్రయాగ్రాజ్, కోల్కతా, ఫిబ్రవరి 26: కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్రాజ్ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన ఈ మేళాలో 66.21 కోట్ల మందికి పైగా పాల్గొని పుణ్య స్నానాలు చేయగా, ఆఖరి రోజు1.44 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ కుంభమేళాకు ప్రత్యక్షంగా హాజరు కాని భక్తులకు డిజిటల్ ఫొటో స్నానం చేయించడం విశేషం.
ఈ మహా ఉత్సవంలో కొన్ని విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. వివిధ ప్రదేశాలలో కుంభ మేళాకు వస్తున్న, వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో మూడు నాలుగుసార్లు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కుంభమేళాకు వచ్చే దారులన్నీ కిలో మీటర్ల మేర తరచూ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. ఐఐటీ బాబా, కబూతర్ వాలా బాబా, పూసలమ్ముకునే మోనాలిసా లాంటి వారు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పొందారు.
కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న జార్ఖండ్కు చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటకు వారి కారు జార్ఖండ్లోని హాట్వగ్ గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
మహా కుంభమేళా 144 ఏండ్లకు ఒకసారి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇటీవల కుంభమేళాలో జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె 144 ఏండ్లకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుందని వేసిన అంచనాను ప్రశ్నించారు. మతా బెనర్జీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విచ్చేసిన హిందూ మహా ఉత్సవం మహా కుంభ మేళాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సందర్శించకుండా హిందువులను అవమానించారని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే విమర్శించారు. వీరిని హిందూ ఓటర్లు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించి రాహుల్, ఠాక్రే కుటుంబాలు ఇందులో పాల్గొనాలని, కాని వారు దానికి గైర్హాజరై హిందువులను అవమానపరిచారని విమర్శించారు.