ఔరంగబాద్: మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.. హెలికాప్టర్ కొనేందుకు బ్యాంకులో దరఖాస్తు పెట్టుకున్నాడు. హింగోలీకి చెందిన 22 ఏళ్ల రైతు కైలాస్ పతంగే .. ఆరు కోట్ల రుణం ఇవ్వాలని గోరేగావ్లోని ఓ బ్యాంకులో అప్లికేషన్ ఇచ్చాడు. ఆ డబ్బుతో హెలికాప్టర్ కొని, దాన్ని కిరాయికి నడపనున్నట్లు ఆ రైతు తన దరఖాస్తులో తెలిపాడు. వ్యవసాయం కోసం ఖర్చు చేయలేకపోతున్నట్లు ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పతంగేకు రెండు ఎకరాల భూమి ఉంది. అయితే వర్షం సరిగా లేని కారణంగా వ్యవసాయం చేయలేకపోతున్నాడు. గడిచిన రెండేళ్ల నుంచి సోయాబీన్ను పండించానని, కానీ ఆ పంట వల్ల లాభాలు లేవని, పంట బీమా నుంచి వచ్చిన డబ్బు కూడా సరిపోలేదని ఆ రైతు తెలిపాడు.
వ్యవసాయం భారంగా మారడం వల్లే హెలికాప్టర్ కొనాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు. మంచి జీవనం కొనసాగించాలంటే దాన్ని రెంట్కు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు. పెద్దవాళ్లకే పెద్ద కలలు ఎందుకు ఉండాలి, రైతులు కూడా పెద్ద కలలు కనాలని, హెలికాప్టర్ కొనేందుకు 6.65 కోట్ల లోన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నానని, మిగితా వ్యాపారాల్లో చాలా పోటీ ఉందని, అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు ఆ రైతు తెలిపాడు.