Madhya Pradesh : డిజిటల్ యుగంలో ప్రతివారు తమ లైఫ్స్టైల్ను పూర్తిగా బయటపెట్టుకుంటున్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా ఒక మహిళ తన యూట్యూబ్ ఛానెల్లో తనకున్న బంగారు ఆభరణాలను చూపించింది. వాటి గురించి వివరించింది. ఇంకేముంది.. ఆ వీడియో చూసిన దొంగలు ఆ నగలన్నింటినీ దోచుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
ఇక్కడి శివపురి ప్రాంతంలోని మోహిని అనే గ్రామంలో రచనా గుర్జార్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమెకు యూట్యూబ్ ఛానెల్తోపాటు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా ఉంది. ఈ రెండింటిలో ఆమె ఎప్పుడూ తనకున్న సంపద గురించి వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. తనకున్న నగలు, ఇతర ఖరీదైన వస్తువుల గురించి, ఇంటి గురించి వివరిస్తూ ఉంటుంది. ఇటీవల తన నగల్ని కూడా చూపించింది. ఈ వీడియోలు చూసిన దొంగలు రచనా గుర్జార్ ఇంటిని దోచుకోవాలని డిసైడయ్యారు. పక్కా ప్రణాళికతో ఇంట్లోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, పూర్తి మెటీరియల్స్తో వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. రచనా గుర్జార్ చూపించిన బంగారు, వెండి నగలు, డబ్బు దోచుకెళ్లారు. తర్వాత ఇది గమనించిన రచన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఏఎస్పీ సంజీవ్ మూల్ తెలిపారు. త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు. రచన సోషల్ మీడియా యాక్టివిటీ వల్లే దొంగలు ఆమె ఇంటిని టార్గెట్ చేశారని, అందువల్ల ఎవరైనా ఇలాంటివి పోస్ట్ చేసేముందు జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన, అప్రమత్తత అవసరం అని సూచించారు.