Madhya Pradesh | భోపాల్, అక్టోబర్ 25: సరిగ్గా నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ హృదయవిదారకమైన దృశ్యం దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఓ పదిహేనేండ్ల బాలిక రక్తమోడుతూ.. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. సహాయం చేయమని ప్రతి ఇంటి తలుపు కొడుతూ, కనిపించిన వారినందరినీ యాచించిన ఘటన ఎందరినో కంటతడి పెట్టించింది.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట జరిగిన ఈ ఉదంతం తమ ప్రభుత్వ పనితీరుకు మాయని మచ్చగా మిగులుతుందని భావించిన రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ఆ బాలికను ఆదుకొనే విషయమై భారీ హామీలు గుప్పించింది. ఆ బాలిక ప్రస్తుతం ఇంటికి చేరి.. ఆరోగ్యం కొంత కుదుటపడుతున్నప్పటికీ.. ప్రభుత్వాధినేతలు చేసిన శుష్క వాగ్దానాల గాయం మాత్రం ఆమెను ఇంకా వేధిస్తున్నది. తాము తక్కువ (దళిత) కులానికి చెందిన వారమైనందునే తమకు ఎవరూ సాయం చేయలేదని ఆ బాలిక సోదరుడు అన్నారు.
ఆ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన ఆటోడ్రైవర్ను అరెస్టు చేసినప్పుడు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ‘ఆ అమ్మాయి ఈ రాష్ట్రం బిడ్డ, ఆమెను అన్ని విషయాలలో ఆదుకుంటాం’ అని చెప్పారు. దీనిపై ఎన్డీటీవీ ప్రతినిధి బుధవారంనాడు సీఎం చౌహాన్ను ప్రశ్నించగా.. ‘నమస్కారం’ అంటూ తప్పించుకున్నారు. తాము దవాఖాన నుంచి తిరిగి వచ్చిన తరువాత తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వచ్చి రూ.1,500 ఇచ్చి వెళ్లారని బాలిక బంధువు ఒకరు తెలిపారు. ఇక ప్రభుత్వం నుంచి సామాజిక న్యాయం పెన్షన్ కింద మరో రూ.600 ఇచ్చారని చెప్పారు. ఇప్పటివరకు బాలికకు అందింది రూ.2100 మాత్రమే.
దళితులపై నేరాల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానం
50,900- 2021లో దేశవ్యాప్తంగా దళితులపై చోటుచేసుకున్న దాడులు
7211- ఒక్క మధ్యప్రదేశ్లోనే దళితులపై జరిగిన దాడులు
25.3%- దేశంలో దళితులపై జరిగిన నేరాల రేటు
63.6%- మధ్యప్రదేశ్లో దళితులపై జరిగిన నేరాల రేటు