భోపాల్: సాధారణంగా కిలో బెండకాయల ధర రూ.50కి అటుఇటుగా ఉంటుంది. కానీ పై ఫొటోలో కనిపిస్తున్న ఎర్ర బెండకాయలు మాత్రం చాలా కాస్ట్లీనట. ఎంత కాస్ట్లీ అంటే గరిష్టంగా కిలో ధర రూ.800 వరకు ఉంటుందట. వాటిలోని పోషక గుణాలే వాటి ధర అంత ఎక్కువగా ఉండటానికి కారణమట. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లాలోని ఖజూరి కలాన్ ఏరియాలో మిస్రీలాల్ రాజ్పుత్ అనే రైతు ఈ ఎర్రబెండ కాయలు పండించాడు. ఆకుపచ్చ రంగులో ఉండే సాధారణ బెండకాయలతో పోల్చితే ఈ బెండకాయల్లో పోషక గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయని మిస్రీలాల్ చెప్పాడు.
బెండకాయలు సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ తాను పండిస్తున్న బెండకాయలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. ఆకుపచ్చ బెండకాయలతో పోల్చిచూస్తే ఈ బెండకాయల్లో పోషక గుణాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్టరాల్ లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్లకు ఈ ఎరుపు బెండకాయలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అని రైతు మిస్రీలాల్ రాజ్పుత్ వివరించాడు.
ఈ బెండకాయలను ఎలా సాగు చేస్తారని ప్రశ్నించగా మిస్రీలాల్ ఏం చెప్పారంటే.. నేను వారణాసిలోని వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి నేను కిలో ఎర్ర బెండ విత్తనాలు కొనుగోలు చేశాను. గత జూలై మొదటి వారంలో ఆ విత్తనాలను నా చెలకలో విత్తాను. దాదాపు 40 రోజులు పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడే బెండకాయలు రావడం మొదలైంది అన్నారు. అయితే, ఈ బెండ సాగు కోసం తాను ఎలాంటి హానికర రసాయన ఎరువులను వాడలేదని మిస్రీలాల్ తెలిపాడు.
ఇక ఒక ఎకరం విస్తీర్ణంలో ఎర్ర బెండ సాగుచేస్తే కనిష్టంగా ఎకరానికి 40-50 క్వింటాళ్లు, గరిష్టంగా 70-80 క్వింటాళ్ల పంట చేతికి వస్తుందని మిస్రీలాల్ రాజ్పుత్ చెప్పాడు. ఆరోగ్యానికి మేలు చేసే పోషక గుణాలు మెండుగా ఉన్నందున సాధారణ బెండ కాయలతో పోల్చితే ఈ ప్రత్యేకమైన బెండకాయల ధర కిలో 7 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నాడు. అర కిలో ఎర్ర బెండకాయలను కొన్ని మాల్స్లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారని తెలిపాడు. అంటే గరిష్టంగా కిలో ఎర్ర బెండ రూ.800 పలుకుతుందన్నమాట.