భోపాల్, ఫిబ్రవరి 15: గత ఆరు నెలలుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా నోటికి వచ్చినట్టు తిట్టాడు. నన్నే నిలదీస్తావా.. పోలీసులు లోపలేసి బొక్కలు ఇరగదీస్తారని హెచ్చరించాడు. సోమవారం ఖాన్డ్వా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నదని గొప్పలు చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ ఉన్న ఓ వ్యక్తి మంత్రిని నిలదీశాడు. తన భార్య అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నారని, ఆమెకు గత ఆరు నెలలుగా ఎందుకు జీతం ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. వెంటనే కోపం తెచ్చుకున్న మంత్రి ‘నన్నే నిలదీస్తావా? లోపలేయించి బొక్కలు ఇరగదీయిస్తా’ అని బెదిరించారు.