స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ: మూడు క్వింటాళ్ల ఉల్లిగడ్డ పండిస్తే వచ్చింది రెండు రూపాయలే! ఇది మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రైతుల దుస్థితి. మూడు క్వింటాళ్ల ఉల్లిగడ్డను పండించిన రైతు జయరాం ఇటీవల అమ్మడానికి షాజాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డుకు తీసుకెళ్లాడు. ఒక్కో బస్తాలో 50 కిలోల చొప్పున మొత్తం ఆరు బస్తాల్లో సరుకును మార్కెట్కు తెచ్చాడు.
ఇది చూసిన ఓ వ్యాపారి రైతు వద్దకు వచ్చాడు. బేరం చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ధర లేదంటూ మాయమాటలు చెప్పి ఒక్కో బస్తాకు ఒక్కో రేటు చొప్పున కొనుగోలు చేయడం ప్రారంభించాడు. తొలుత ఒక బస్తాకు రూ.60, తర్వాత రెండు బస్తాలకు రూ.75 చొప్పున రూ.150, చివరికి మిగిలిన మూడు బస్తాలకు రూ.40 చొప్పున రూ.120 ఇచ్చి కొనుగోలు చేశాడు. దీంతో రైతుకు రూ.330 వచ్చాయి. అయితే ఉల్లిగడ్డలను మార్కెట్ యార్డుకు తీసుకురావడానికి రవాణా కింద రూ.280 ఖర్చు అయ్యింది.
మార్కెట్ యార్డులో హమాలి ఖర్చులకు రూ.48 అయ్యింది. ఈ రెండింటిని కలిపితే ఖర్చుల కింద రూ.328 పోను రైతుకు మిగిలింది రెండు రూపాయలే. దీంతో ఆ రైతు హతాశుడయ్యాడు. ఎంతో కష్టపడి పంట పండించి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే వచ్చేది రెండు రూపాయలా అంటూ బోరున ఏడ్చాడు. వాస్తవానికి మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసింది రైతుల కోసమే. ఇవి ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. కాబట్టి దళారులు, వ్యాపారులు రైతులను దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రైతు ఏవిధంగా నిలువుదోపిడీకి గురవుతున్నాడో చెప్పడానికి ఈ ఘటన ఓ నిదర్శనం.