భోపాల్, జూలై 21: మధ్యప్రదేశ్ రైతులు ఎరువుల కొరతను నిరసిస్తూ రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా డీఏపీ, యూరియా కొరత తీవ్రం కావడంతో బీజేపీ సర్కారు తీరుపై మండిపడుతూ రాస్తారోకోలు చేపడుతున్నారు. మంగళవారం ఎంపీ రైతులు డిండోరీలో సర్కారు వ్యతిరేక ప్రదర్శనతో దద్దరిల్లజేశారు. మండలాల్లోని వ్యవసాయ మార్కెటింగ్ గోదాములో ఎరువులు లేవని తెలియడంతో ఆగ్రహించిన రైతులు పెద్దసంఖ్యలో రహదారి మీదకు వచ్చి బైఠాయించారు. సుమారు గంటసేపు డిండోరీ-మండలా రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వ్యవసాయ విభాగం అధికారులు వచ్చి రైతులను సముదాయించడంతో రైతులు శాంతించి బైఠాయింపును విరమించారు.
ఢిల్లీలో మనమే, గల్లీలో మనమే అని చెప్పుకొని మురిసిపోయే డబుల్ ఇంజిన్ సర్కారుతో రైతులు ఎంతగా విసిగిపోయారో ఈ ఆందోళన కార్యక్రమం అద్దం పడుతున్నది. ‘నెలరోజుల నుంచి గోదాము చుట్టూ చక్కర్లు కొడుతున్నాం. అక్కడి సిబ్బంది ఎరువులకు బదులుగా టోకన్లు ఇచ్చి పంపిస్తున్నారు. పొలంలో పంట వేశాం.. ఇప్పుడు ఎరువులు కావాలి.. టోకన్లు పొలంలో చల్లలేం కదా’ అని రైతులు మండిపడుతున్నారు. గతకొద్ది నెలలుగా ఎంపీలో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇది కొత్తగా వచ్చిన సంగతి కాదు. ఏటేటా ఎరువుల కోసం రైతులు కాళ్లరిగేలా తిరగడం మామూలే అయిందని అంటున్నారు. బీజేపీ పాలనలో ఎరువుల కొరతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ఎరువులు రాష్ట్రంలోనికి అసలే రావడం లేదా? అంటే వస్తున్నాయి. సర్కారు ఎరువులు దండిగా ఉన్నాయని ంటుంది. మరి అవి ఏమవుతున్నాయి? ప్రైవేటు వన్యాపారుల దుకాణాల్లోకి, బీజేపీకి చెందిన బడారైతుల ఇండ్లలోకి వెళ్తున్నాయి. నల్లబజారును పెంచి పోషించేందుకు ఎరువులను తీసుకువెళ్లి దాస్తున్నారు. ఇదంతా డబ్బు కక్కుర్తి కోసం బీజేపీ ఆడుతున్న నాటకం’ అని దుయ్యబట్టారు. రెండురోజుల్లో ఎరువులు సరఫరా చేస్తామని బైఠాయింపు జరిపిన రైతులకు వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన మాట ప్రకారం ఎరువుల రాకపోతే మళ్లీ రోడ్డెక్కడం ఖాయమని రైతులు అంటున్నారు.