Madhya Pradesh | భోపాల్, అక్టోబర్ 7: త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను విడుదల చేసిన కమలం పార్టీ.. సీఎం శివరాజ్ పేరు ఇంకా ప్రకటించకపోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శివరాజ్ సింగ్కు టిక్కెట్ దక్కడం కూడా కష్టమేనని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లోని దిండోరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి నేను మళ్లీ సీఎం అవుతానా?’ చెప్పండి అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ‘నేను మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? లేక చెడ్డ ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? మీరు చెప్పండి! ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? ’ అని సభకు వచ్చిన ప్రజలను అడిగారు. అంతేకాకుండా ‘కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో కొనసాగాలా? దేశ ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగాలా?’ అని ప్రశ్నలు వేశారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లోనూ శివరాజ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గమైన బుధ్నిలో ఇటీవల మాట్లాడుతూ ‘నన్ను ఎన్నికల్లో పోటీ చేయమంటారా?’ అని అడిగారు. తాను లేకుంటే సోదరుడి వంటి తనను కోల్పోతారని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదేవిధంగా పలు ఇతర సందర్భాల్లో ‘రాజకీయాలు జారుడు బండ వంటివి’, ‘నాకు ఏ పదవిపై అత్యాశ లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలను బరిలోకి దింపిందనే చర్చ నడుస్తున్నది. అధికారం దక్కితే ఈసారి సీఎం సీటుకు శివరాజ్ కాకుండా.. వీరిలో కొంతమంది పోటీలో ఉండే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా, శివరాజ్ మరోసారి సీఎం అయ్యే అవకాశమే లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. గురువారం ధార్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ మధ్యప్రదేశ్కు వస్తున్న ప్రధాని మోదీ.. శివరాజ్ పేరును చెప్పేందుకు ఇష్టపడటం లేదని, తన కోసం ఓటు వేయండంటూ మోదీ ప్రజలను అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు.