Madhya Pradesh | భోపాల్/జైపూర్, డిసెంబర్ 10: మధ్యప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తెలిసిపోనున్నది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సీఎం అభ్యర్థి పేరును 7 గంటలకు ప్రకటిస్తారని ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర బీజేపీ పరిశీలకులుగా హర్యానా సీఎం ఖట్టర్, ఓబీసీ మోర్చా నేత కే లక్ష్మణ్, పార్టీ కార్యదర్శి అశా లక్రా హాజరు కానున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 230 స్థానాలకు గానూ 163 సీట్లలో విజయం సాధించింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఎవరినీ ప్రకటించలేదు. సీఎం రేసులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తోపాటు సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్పటేల్, నరేంద్రసింగ్ తోమర్, కైలాశ్ విజయవర్గీయ, వీడీ శర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వసుంధర రాజేతో 10 మంది ఎమ్మెల్యేల భేటీ
మరోవైపు రాజస్థాన్లోనూ కొత్త ముఖ్యమంత్రిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. శాసనసభా పక్ష నేతను ఎన్నుకొనేందుకు ఎమ్మెల్యేల సమావేశం ఎప్పుడనే దానిపై బీజేపీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన దాదాపు 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం మాజీ సీఎం వసుంధర రాజేను ఆమె నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అంతకుముందు ఫలితాల వెల్లడి తర్వాత కూడా పలువురు ఎమ్మెల్యేలు రాజేను కలిశారు. రాష్ట్ర సీఎం పదవిని మరోసారి చేపట్టేందుకు వసుంధర రాజే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ అధినాయకత్వానికి సంకేతం ఇచ్చేలా ఆమె ఎమ్మెల్యేలతో సమావేశం పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.