భోపాల్: బీజేపీ యువజన నాయకుడు ఒక వైద్యురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెతో పాటు వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించాడు. ఆమెపై కాల్పులు జరుపుతానని బెదిరంచాడు. (BJP Youth Leader Molests Doctor) డాక్టర్లు, వైద్య సిబ్బంది దీనిపై నిరసన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున సాగర్లోని ప్రభుత్వ బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి లక్ష్మీ తివారీ అనే మహిళను అత్యవసర చికిత్స కోసం తీసుకువచ్చారు. ఆ రోగి ఆసుపత్రికి చేరుకోకముందే ఆమె చికిత్స కోసం పలు ఫోన్కాల్స్ వచ్చినట్లు వైద్య సిబ్బంది ఆరోపించారు.
కాగా, ఆ మహిళకు చికిత్స అందిస్తుండగా ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. గమనించిన వైద్యురాలు వారి ప్రవర్తనను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్ శ్రీవాస్తవ ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె ప్రైవేట్ భాగాన్ని తాకేందుకు ప్రయత్నించాడు. ఆ వైద్యురాలు ఆసుపత్రి ఆవరణ దాటి బయటకు రాగానే కాల్చి చంపుతానని బెదిరించాడు. అనిల్ శ్రీవాస్తవ, అతడి అనుచరుడు కలిసి అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ వైద్యురాలు, నర్సింగ్ సిబ్బంది ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలిపారు. విధులు బహిష్కరించడంతోపాటు ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని దిగ్బంధించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడంతో రోగులు ఇబ్బందిపడ్డారు.
అయితే ఆసుపత్రి యాజమాన్యం, పోలీసుల హామీ మేరకు డాకర్లు, వైద్య సిబ్బంది తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది.
కాగా, బీజేపీ యువజన నేత అనిల్ శ్రీవాస్తవ, అతడి అనుచరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను పెంచినట్లు వివరించారు.