భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రజలను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ జెండాలు ఉన్న ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి సేవలన్నీ నిలిపివేయాలని బీజేపీ మేయర్ అభ్యర్థి బెదిరించాడు. రాజధాని భోపాల్కు సమీపంలో ఉన్న రత్లాం నగరంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఈ నెల 13న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ మేయర్ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్కు, కాంగ్రెస్ అభ్యర్థి మయాంక్ జాట్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రహ్లాద్ పటేల్కు మద్దతుగా అక్కడ రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. సీఎం ప్రచారానికి జనం పెద్దగా హాజరుకాలేదు. అయితే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి మయాంక్ సభకు జనం పోటెత్తారు.
కాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి మయాంక్ గట్టి పోటీ ఇవ్వడాన్ని బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్ సహించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక ప్రాంతంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ జెండాలున్న ఇళ్లను చూసి ఆయన ఆగ్రహం చెందారు. ‘కాంగ్రెస్ జెండాలు ఉన్న అన్ని ఇళ్ల ఫొటోలు తీయండి. వారికి అన్ని సేవలు నిలిపివేయండి. మనకు 5-10 ఇళ్ల నుంచి ఓట్లు రాకపోయినా పర్వాలేదు. కానీ వారికి గుణపాఠం చెప్పాలి’ అని ప్రహ్లాద్ పటేల్ మండిపడ్డారు. బహిరంగంగా ఆయన బెదిరించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు తన మాటలను వక్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని బీజేపీ మేయర్ అభ్యర్థి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు. దర్యాప్తు కోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీని వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
रतलाम के शिवनगर गरीब बस्ती में @INCMP के झंडे देखकर @BJP4India महापौर प्रत्याशी प्रहलाद पटेल भड़क गये कहा जिसने कांग्रेस के झंडे लगाए उनकी लिस्ट बनाओ और सारी सुविधाएं रुकवा दो ! नेताजी भूल गये पैसा जनता का ही है, उनकी पार्टी का नहीं, बाद में कह रहे हैं बहुत कुछ एडिट कर दिया pic.twitter.com/3nm2LRuDvW
— Anurag Dwary (@Anurag_Dwary) July 10, 2022