Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని రాజ్ గఢ్ లోని పిప్లియా రాసోడా గ్రామంలో 25-30 అడుగుల లోతు గల బోరుబావిలో మంగళవారం సాయంత్రం నాలుగేండ్ల బాలిక పడిపోయింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని జిల్లా ఎస్పీ ధర్మరాజ్ మీనా తెలిపారు. ఆ బాలికను వెలికి తీసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదం సంగతి తెలియగానే స్థానిక అధికార యంత్రాంగంతో సంప్రదించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జాతీయ విపత్తు నివారణ విభాగాల సిబ్బంది సురక్షితంగా ఆ బాలికను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.