భువనేశ్వర్, సెప్టెంబర్ 9: ఒడిశాలోని కేంద్రపార జిల్లా బటిపాడలోని ఓ బ్యాంకు హఠాత్తుగా వినియోగదారులతో కిటకిటలాడింది. తమ ఖాతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు/సంస్థలు రూ.10 వేల నుంచి 70 వేల వరకు డబ్బులు వేశారని, వాటిని ఎవరు వేశారో చెప్పాలని కొందరు సిబ్బందిని కోరగా, మరికొందరు అలా పడిన మొత్తాన్ని విత్డ్రా చేయడానికి క్యూ కట్టారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ ప్రతాప్ ప్రధాన్ మాట్లాడుతూ కొందరికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నగదు జమైనట్టు తెలిపారు.
మిగిలిన వారి ఖాతాల్లో ఎవరు డబ్బులు జమ చేశారో తెలియదని, వారి ఖాతాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, కొందరి ఖాతాల్లో రూ.60 వేల నుంచి 80 వేల వరకు జమయ్యాయని, 250 మంది వరకు వాటిని విత్డ్రా కూడా చేసుకున్నారని తెలిపారు.