Lyme Disease | హిమాచల్ప్రదేశ్లో తొలిసారిగా అరుదైన లైమ్ వ్యాధిని గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ భాగంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (IGMC) నిపుణులు 232 మంది వ్యక్తుల నమూనాలను సేకరించారు. ఇందులో 144 మందికి పాజిటివ్గా తేలింది. ఆయా నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్కు పంపారు. రిపోర్టులు వస్తే ఎంత మందికి లైమ్ వ్యాధి సోకిందో తెలుతుందని అధికారులు పేర్కొన్నారు. మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆర్థిక సహాయంతో చెక్ రిపబ్లిక్ నుంచి వ్యాధిని పరీక్షించడానికి డయాగ్నస్టిక్ కిట్స్ను కొనుగోలు చేశారు. లైమ్ వ్యాధిని 2022 సంవత్సరంలో గుర్తించారు.
గతేడాది 173 నమూనాలు సేకరించారు. లైమ్ వ్యాధి బొర్రేలియా బర్గ్డోర్ఫెరి సెన్సు లాటో అనే చిన్న బాక్టీరియల్ స్పిరోచెట్తో సోకుతుంది. ఇది ఐక్సోడ్స్ జాతి కీటకాల కాటు ద్వారా వ్యాపిస్తుంది.
వ్యాధి మే నుంచి సెప్టెంబర్ మధ్య సోకుతుంది. ఈ పేలు అడవులు, పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. జంతువులకు అంటుకుని రక్తాన్ని పీలుస్తుంటాయి. పేలు ఎలుకలు, ఎద్దులు, ఆవులు, కొన్ని జాతుల పక్షులలో కనిపిస్తాయి. లైమ్ వ్యాధి అమెరికా, ఐరోపాలో వేగంగా పెరుగుతున్న వైరల్ వ్యాధి. ఐరోపా నుంచి గత 25 సంవత్సరాలుగా ప్రపంచమంతటా వ్యాపిస్తోంది.
తొలి దశలో పేలు కుట్టిన ప్రాంతంలో దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, విపరీతమైన అలసట, కండరాల నొప్పి ఉంటుంది. రెండోదశలో 3-10 వారాల్లో దద్దుర్లు కనిపిస్తాయి. మెడలో నొప్పి, రెండు వైపులా కండరాలు బలహీనపడటం, గుండె చప్పుడు సక్రమంగా లేకపోవడం, వెన్నునొప్పి, చేతులు, కాళ్లలో తిమ్మిరి, కళ్లలో నొప్పి, అంధత్వం, మోకాళ్ల నొప్పులు వస్తాయి. మూడో దశ పేల కాటు తర్వాత 2-12 నెలల తర్వాత ప్రారంభమవుతుంది. చేతులు, కాళ్ల వెనుక చర్మం సన్నగా మారుతుంది.