లక్నో, ఆగస్టు 23: ఐసీయూలోకి చెప్పులతో రావొద్దని కోరిన వైద్యులపై బీజేపీ నాయకురాలు, లక్నో మేయర్ సుష్మా ఖారక్వాల్ చిందులు తొక్కారు. నన్నే అడ్డుకుంటారా? అంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేయర్ అనుచరులు దవాఖానపైకి బుల్డోజర్ను తీసుకోరావడంతో వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
లక్నోలోని ఓ ప్రైవేట్ దవాఖాన ఐసీయూలో సురేన్ కుమార్ అనే రిటైర్డ్ జవాన్ చికిత్స పొందుతున్నాడు. అతడ్ని పలకరించేందుకు లక్నో మేయర్ సుష్మా ఖారక్వాల్ అక్కడికి వెళ్లారు. మేయర్తో పాటు ఆమె వెంట పదుల సంఖ్యలో ఉన్న బీజేపీ కార్యకర్తలు చెప్పులు, బూట్లతో ఐసీయూలోకి వెళ్తుంటే. .వైద్య సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పులు, బూట్లు విడిచి ఐసీయూలోకి రావాలని మర్యాదపూర్వకంగానే ఆమెను కోరామని, అయినప్పటికీ తమతో వాగ్వాదానికి దిగారని హాస్పిటల్ యాజమాన్యం వివరించింది.