న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిలు, కుంపట్లు, కిరోసిన్ స్టవ్లను ఆశ్రయించాల్సిందేనా? లేక ఎలక్ట్రిక్, ఇండక్షన్ స్టవ్లు, వంటింట్లోకి చేర్చాల్సిందేనా? రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు అందరూ కచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనా? అంటే అవునని అనిపిస్తున్నది. ఎందుకంటే ఎల్పీజీ సంక్షోభం మరింత ముదరనున్నది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచమంతటిపై పడింది. ముఖ్యంగా ప్రతి వంట ఇంటికి అవసరమైన ఎల్పీజీ సరఫరా చెయిన్కు యుద్ధం కారణంగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనిని పునరుద్ధరించడానికి మూడు నుంచి నాలుగేండ్లు పట్టవచ్చునని భావిస్తున్నారు. ఎల్పీజీ సంక్షోభం లేదని అనుకుంటున్న వారికి నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. యుద్ధం ముగిసినా, ముగియకున్నా ప్రపంచ ప్రజలైతే దీని దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయిందా లేక శాశ్వతంగా దెబ్బతిని ఆగిపోయిందా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎల్పీజీ సరఫరాలపై భారత్ ఎక్కువగా పశ్చిమాసియాపై ఆధారపడి ఉంది. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఎనర్జీ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసి నష్టం కలిగించడంతో పాటు హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఎల్పీజీ రవాణా ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఎల్పీజీ సరఫరాదారుల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు కనీసం మూడేండ్లు పడుతుంది. ఇది ఇంకా దీర్ఘకాలం కొనసాగే అవకాశం కూడా ఉంది. దీని కారణంగా భారత్ దిగుమతి నష్టాలను ఎదుర్కోవడంతో పాటు వ్యయ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి ద్వారానే సమకూర్చుకుంటున్నది. ఎల్పీజీలో 90 శాతం హొర్ముజ్ జలసంధి మీదుగానే భారత్కు దిగుమతి అవుతున్నది. అయితే ఆ దారిని మూసివేయడంతో పూర్తి స్థాయిలో ఎల్పీజీ సరఫరా జరగడం లేదు.