ఛత్రపతి శాంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి శాంభాజీనగర్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠా(LPG Racket Busted)ను అరెస్టు చేశారు. హిందూ పెట్రోలియం సంస్థకు చెందిన ట్యాంకర్ల నుంచి స్మగ్లర్లు గ్యాస్ చోరీ చేస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి సుమారు 1.26 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి విలిజెన్స్ అధికారులు.. ఓ ప్రాంతంపై శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. కోజేవాడి శివార్ ప్రాంతంలో ఏప్రిల్ రెండో తేదీ రాత్రి రెయిడ్ చేపట్టారు. గణేశ్ బెల్లాలి అనే ఆఫీసర్ నేతృత్వంలో ఆ సోదాలు జరిగాయి.
అయితే హెచ్పీసీఎల్ ట్యాంకర్లకు చెందిన సీల్ తీసి చిన్న ట్యాంకర్లలో గ్యాస్ దొంగలించి తీసుకెళ్తున్న ముఠాను పట్టుకున్నారు. చిన్న ట్యాంకర్లతో పాటు కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్లకు ఆ ఇంధనాన్ని ఎక్కిస్తున్న సమయంలో స్మగ్లర్లను పట్టుకున్నారు. MH 43 K 5921 , MH 43 CK 5747 నెంబర్లతో ఉన్న రెండు ట్యాంకర్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గ్యాస్ స్మగ్లర్లు సుమారు 35,220 కేజీల ఎల్పీజీ ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు 26 కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన ఆస్తుల విలువ సుమారు 1.26 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ గ్యాస్ సుమారు 2480 పేద కుటుంబాలకు సరిపోతుందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల వంట కోసం ఏర్పాటు చేసిన గ్యాస్ను దొంగలించి మాఫియా వ్యక్తులు డబ్బు సంపాదించుకుంటున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, హోర్ముజ్ జలసంధి నుంచి ఇంధన సరఫర నిలిచిపోవడం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీన్ని అదునుగా తీసుకున్న మాఫియా.. గ్యాస్ను దొంగలిస్తున్నట్లు తేల్చారు.