న్యూఢిల్లీ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వినియోగదారులకే రాయితీని పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతావారందరూ ఇకపై మార్కట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం మీడియాకు వెల్లడించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్ వినియోగదారులకు సబ్సీడీ ఇవ్వడం లేదని చెప్పారు. ఇకపై ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్లకే సబ్సిడీ అందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 9 కోట్ల మంది ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పడు ఈ పథకం కింద ఉన్నవారికి ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ లభించనుంది. 2010లో పెట్రోల్పై సబ్సిడీ ఎత్తివేయగా.. 2014 నవంబర్లో డీజిల్పైన కేంద్రం సబ్సిడీని తొలగించింది. 2016లో కిరోసిన్పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేసిన ప్రభుత్వం.. తాజాగా గ్యాస్పై సబ్సిడీని ఎత్తివేస్తూ సామాన్యుడి నడ్డి విరిచింది.