బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు భారీ శబ్దం వినిపించింది. భారీ శబ్దంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం ధాటికి పలు నివాసాల్లో కిటికీలు కొట్టుకున్నాయి. ఈ శబ్దానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు వాసుల ట్వీట్ ప్రకారం.. షార్జాపూర్ ఏరియా, జేపీ నగర్, బెన్సన్ టౌన్, ఉల్సూరు, ఇస్రో లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లే అవుట్, సౌత్ బెంగళూరు, ఈస్ట్ బెంగళూరులో భారీ శబ్దం వినిపించినట్లు పేర్కొన్నారు.
శబ్దం ధాటికి కిటికీలు కొట్టుకున్నాయి. అసలేం జరిగింది. ఇది మరొక సోనిక్ బూమ్? అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఈ శబ్దంపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. తమ విమానాలు ఇలాంటి శబ్దాలు చేయలేదని స్పష్టం చేశారు.
అయితే బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించడంపై సోనిక్ బూమ్ అని ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఈ శబ్దానికి సోనిక్ బూమ్ కారణమని పోలీసులు కానీ, వైమానిక దళం కానీ ధృవీకరించలేదు. అసలు సోనిక్ బూమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎయిర్ క్రాఫ్ట్ లు వేగంగా వెళ్లినప్పుడు వచ్చే ఫలితమే సోనిక్ బూమ్. ఒక విమానం ధ్వని వేగం కంటే వేగంగా కదిలినప్పుడు వాతావరణంలో షాక్ తరంగాలు సృష్టించబడినప్పుడు సోనిక్ బూమ్ ఏర్పడుతుంది. ధ్వని గాలిలో సెకనుకు 343 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
గతేడాది మే నెలలో బెంగళూరులో సోనిక్ బూమ్ శబ్దం వినిపించింది. అయితే అప్పుడు అందరూ దాన్ని ఉరుముగా అభిప్రాయపడ్డారు. ఆ టైమ్లో శబ్దం ధాటికి కిటికీలు కొట్టుకున్నాయి. స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించాయి. అయితే ఆ శబ్దాలు.. సుఖోయ్ 30 యుద్ధ విమానం వల్ల వచ్చాయని, దీన్ని భారత వైమానిక దళం కూడా ధృవీకరించిందని పోలీసులు తెలిపారు.