బెంగళూరు: ఈ మధ్య హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్ రాముడిని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాముడు ప్రతి మధ్యాహ్నం తన భార్య సీతతో కలిసి మద్య సేవించేవాడని వ్యాఖ్యానించాడు. పైగా ఈ మాట తాను చెప్పడంలేదని, వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండలో ఉన్నదని చెప్పాడు.
‘మధ్యాహ్నం వేళల్లో సీతతో కలిసి మద్యం సేవించడం రాముడి ప్రధాన దినచర్య. ఈ మాట నేను చెప్పడం లేదు. వాల్మీకి రామాయణంలో ఈ విషయం ఉందని చెప్పగా నేను విన్నా’ అని భగవాన్ అన్నాడు. శుక్రవారం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, కేఎస్ భగవాన్ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా.. రాముడు మత్తుపదార్థాలు తీసుకునేవాడని, సీతను కూడా తీసుకొమ్మనేవాడని ఆయన వ్యాఖ్యానించాడు.
కేఎస్ భగవాన్ తన పుస్తకం ‘రామ మందిర యాకె బేడ’లో కూడా రాముడి గురించి కామెంట్స్ చేశాడు. భగవాన్ తీరుపై గతంలోనూ, ఇప్పుడు కూడా పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవాన్ వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని నింపేలా ఉన్నాయని విమర్శిస్తున్నాయి. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండను వాల్మీకి రాసినట్లు రుజువులు లేవని వారు చెప్తున్నారు.