UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధికార పగ్గాలు చేపడుతుందని కృష్ణ భగవానుడు తరచూ తనకు కలలోకి వచ్చి చెపుతుంటాడని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మధుర నుంచి యోగి ఆదిత్యానాధ్ను బరిలోకి దింపితే ఆ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధిస్తారని కృష్ణుడు తనకు కలలో కనిపించి చెప్పాడని బీజేపీ రాజ్యసభ ఎంపీ హర్నాధ్ సింగ్ ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు లేఖ రాయడాన్ని ప్రస్తావిస్తూ అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీ సీఎంగా బాబా (యోగి ఆదిత్యానాధ్) విఫలమయ్యాయరని, ఆయనను ఎవరూ కాపాడలేరని అన్నారు. ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు తన కలల్లోకి వచ్చి యూపీలో ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. శాంతి భద్రతలు, రామ మందిరం, పీయూష్ జైన్ కేసు, మాఫియా రాజ్యం వంటి పలు అంశాలపై ఇరు పార్టీలు డైలాగ్ వార్ను పతాకస్ధాయికి చేర్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.