యూపీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ వ్యాఖ్యలు
మథుర: శ్రీకృష్ణ భగవానుడు పేద్ద రాజకీయ నాయకుడని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. ఆయన నుంచే తాము (కాంగ్రెస్ పార్టీ) రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని మథుర పట్టణంలోగల బాంకీ బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సత్యం కోసం పోరాడిన శ్రీకృష్ణుడు పేద్ద రాజకీయ నాయకుడని, తాము ఆయన నుంచే రాజకీయాలు నేర్చుకున్నామని వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్పై ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్కు కాలం చెల్లిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన షాకింగ్ ఫలితాలు చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు కూడా అయిన ఆయన.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు.
తమ నాయకురాలు ప్రియాంకాగాంధీ నేతృత్వంలో యూపీలో కాంగ్రెస్ బలోపేతమైందని భూపేష్ బఘేల్ చెప్పారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నియమాలకు లోబడి తాము ఇంటింటి ప్రచారం నిర్వహించడం లేదని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.