న్యూఢిల్లీ : పార్లమెంట్ ( Parliament ) లో వాయిదాల పర్వమే కొనసాగుతోంది. లోక్సభ, రాజ్యసభల్లో ఇవాళ కూడా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సాగు చట్టాలు, స్నూపింగ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేశారు. మోదీ ప్రభుత్వం చర్చలకు దూరంగా పరుగెడుతున్నట్లు విపక్షాలు లోక్సభలో ఆరోపించాయి. సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు. వర్షాకాల సమావేశాల్లో మూడవ వారం ముగియడానికి వచ్చిందని, కానీ ఇంత వరకు ఎటువంటి సభావ్యవహారాలు సాగలేదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అన్నారు. విపక్షాలతో ప్రభుత్వం చర్చించాలని ఆయన కోరారు. మరోవైపు పన్ను చట్టాల సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పన్ను చట్టాల సవరణ బిల్లుతో తమ వాగ్దానాలను నెరవేర్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.