న్యూఢిల్లీ: మణిపూర్ అంశం(Manipur issue)పై చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో ఆందోళన చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. వరుసగా ఏడో రోజు కూడా పార్లమెంట్ సభా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో కేవలం మూడు నిమిషాల్లోనే స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. మరో వైపు విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని కోరారు.
కాంగ్రెస్ ఎంపీ మానికమ్ ఠాకూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభ ఎంపీలు మనోజ్ జా, రాఘవ చడ్డా, రంజీత్ రంజన్, సయ్యిద్ నసీర్ హుస్సేన్, జేబీ మాతర్, డాక్టర్ వీ శివదాసన్, సందీప్ పాఠక్లు మణిపూర్ అంశంపై చర్చకు నోటీసులు ఇచ్చారు.