న్యూఢిల్లీ: గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు(Mines and Minerals Amendment Bill) 2023ను లోక్సభలో ఆమోదించారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లును పాస్ చేశారు. ద నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమీషన్ బిల్లు 2023, ద నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లును కూడా లోక్సభలో పాస్ చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో తమ ప్రభుత్వం పారదర్శకత వహించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. 2025-26 నాటికి బొగ్గు దిగుమతి నిలిపివేయనున్నట్లు చెప్పారు.
మైనింగ్ బిల్లు ద్వారా గనుల లీజు విషయంలో ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు రానున్నాయన్నారు. అయితే మంత్రి ప్రహ్లాద్ జోషి బొగ్గు గురించి మాట్లాడుతున్న సమయంలోనే.. విపక్ష సభ్యులు మణిపూర్ అంశంపై జోరుగా నినాదాలు చేశారు. గనులు, ఖనిజాల బిల్లుతో తాము తీసుకువచ్చిన సవరణలు గేమ్ ఛేంజర్ కానున్నట్లు ఆయన తెలిపారు. బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో దేశాన్ని సుస్థిరం చేయనున్నట్లు చెప్పారు. విపక్ష ఎంపీల నిరసన నేపథ్యంలో లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు.