Question Paper Leak | పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడితే పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమాన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ‘పైలటింగ్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) బిల్లు-2024’ అనే పేరుతో ప్రవేశ పెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ బిల్లుకు విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించిన తర్వాత ఆమోదం లభించిందన్నారు.
వ్యవస్థీకృత నేరాల వల్ల ప్రతిభావంతులైన అభ్యర్థులు త్యాగాలు చేయాల్సి రావడాన్ని అనుమతించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో టీచర్ల నియామక పరీక్ష – కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ), హర్యానాలో గ్రూప్ డీ పరీక్షలు, గుజరాత్ లో జూనియర్ క్లర్కుల నియామక పరీక్ష, బీహార్ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. పరీక్షల ప్రక్రియ మరింత సురక్షితంగా నిర్వహించేందుకు కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించడానికి జాతీయ ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదించింది.