న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) సస్పెన్షన్ను రద్దు చేయాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ లోక్సభ స్పీకర్ను కోరింది. బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ సస్పెన్షన్ను ఉపసంహరించే తీర్మానాన్ని పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీజేపీ సభ్యులు కూడా దీనికి తమ మద్దతు తెలిపారు. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజెస్ కమిటీ సిఫార్సు చేసింది.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, ప్రధాని మోదీని విమర్శించారు. ‘మణిపూర్ సమస్యపై మోదీ ‘నిరవ్’గా కూర్చున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు.
మరోవైపు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. ‘నిరవ్’ అంటే మౌనంగా ఉండటమని తెలిపారు. ‘ప్రధాని మోదీ సభలో మౌనంగా కూర్చొన్నారన్నది నా ఉద్దేశం. ఆయనను అవమానించడం కాదు’ అని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ వివరణపై ఆ కమిటీ సంతృప్తి చెందింది. ఈ నేపథ్యంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని లోక్సభ స్పీకర్కు సిఫార్సు చేసింది.