న్యూఢిల్లీ, జూలై 21(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగులో ఉన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారానికి లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రధానంగా ప్రతిపాదిత ‘డోర్నకల్-మిర్యాలగూడ’ రైల్వేలైన్ అలైన్మెంట్ను మార్చాలని కోరారు. ప్రతిపాదిత అలైన్మెంట్ వల్ల ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో చాలామంది రైతులు విలువైన భూములు కోల్పోతారని రైల్వే మంత్రికి వివరించారు.
ఈ మండలాల్లోని రైతులు ఇప్పటికే నాలుగు హైవేలు, నాగార్జునసాగర్ కాలువ కింద వందలాది ఎకరాల వ్యవసాయ భూములు కోల్పోయారని చెప్పారు. ప్రతిపాదిత రైల్వేలైన్ వల్ల జిల్లాకు ప్రయోజనం లేదని వివరించారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.