Lok Sabha Elections : కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు దశల్లో ఏయే దశలో ఎన్నెన్ని రాష్ట్రాల్లో ఎన్నేసి లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు..? ఏయే రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి..? ఏయే రాష్ట్రాల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి..? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..
మొదటి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు, రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలకు, నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 లోక్సభ స్థానాలకు, ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు, ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇలా ఏడు దశల్లో మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
ఇక, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, చండీఘర్, డామన్ డయ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లడఖ్, మిజోరం, మేఘలాయ, నాగలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ ఇలా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సింగిల్ ఫేజ్లో పోలింగ్ జరనుంది.
అదేవిధంగా కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ నాలుగు రాష్ట్రాల్లో రెండు దశల్లో.. ఛత్తీస్గఢ్, అసోం
రాష్ట్రాల్లో మూడు దశల్లో.. ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ మూడు రాష్ట్రాల్లో నాలుగు దశల్లో.. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్లలో ఐదు దశల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరు దశల పోలింగ్ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ దశలు, రాష్ట్రాలు, లోక్సభ స్థానాలకు సంబంధించిన వివరాలను కింది పట్టికలో చూడవచ్చు..
ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలో, ఒడిశా రాష్ట్రానికి నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లోక్సభ నాలుగో దశ ఎన్నికలతోపాటు మే 13న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి లోక్సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13, మే 20, మే 25, జూన్ 1న పోలింగ్ జరుగనుంది.