Maharashtra | ముంబై: మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ్య లొల్లి బయటపడింది. క్షేత్రస్థాయిలో తమకే ఎక్కువ బలం ఉందంటూ ఎక్కువ స్థానాలను కేటాయించాలని కూటమిలోని శివసేన (షిండే వర్గం), అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతుండటంతో బీజేపీకి తలనొప్పిగా మారింది.
ఏక్నాథ్ షిండే వర్గం ఏకంగా 22 స్థానాలు కావాలని పట్టుబడుతున్నది. మరోవైపు అజిత్ వర్గం 11 సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న తాము 15 స్థానాల్లోనే పోటీ చేయాలా? అంటూ బీజేపీ ఇరు పక్షాలపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. మిత్ర పక్షాలను ఎలా సముదాయించాలో తెలియక బీజేపీ తలలు పట్టుకుంటున్నది.
మా డిమాండ్ను బీజేపీ ముందుంచాం…
బీజేపీ, శివసేన (షిండే వర్గం) మధ్య తాజాగా సీట్ల పంపకాలపై జరిగిన చర్చలో తమకు 22 ఎంపీ స్థానాలను కేటాయించాల్సిందేనని షిండే వర్గం పట్టుబడినట్టు సమాచారం. ‘గత లోక్సభ ఎన్నికల్లో శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. నలుగురు అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే తమ బలానికి తగ్గట్టుగా 22 స్థానాలను మాకు ఇవ్వాలి’ అని షిండే వర్గానికి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.
మాకు మిగిలేదేంటీ?
అయితే షిండే వర్గం డిమాండ్ను బీజేపీ నేతలు తప్పుబట్టారు. ‘షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్పవార్కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది’ అని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. కాగా, బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఇప్పటివరకు చర్చలు జరగలేదని పేర్కొనడం గమనార్హం.