Petrol Price | న్యూఢిల్లీ, జూన్ 23: ‘ఏవైనా ఎన్నికలు ఉంటే ఇంధన ధరల తగ్గింపు, అవే ఎన్నికలు అవగానే.. ధరల మోతతో వాయింపు’ ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. వచ్చే ఏడాది కాలంలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ తనదైన శైలిలో ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఇంధన ధరలను పెంచి, నిత్యావసరాల ధరలతో నడ్డి విరిచిన బీజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీని నుంచి తప్పించుకొనేందుకు కేంద్రం తిరిగి ఇంధన ధరల తగ్గింపు ఎర వేసేందుకు చూస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) రూ.4-5 తగ్గించే అవకాశం ఉన్నదని, ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆయిల్ కంపెనీలను కోరనున్నదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అయిల్ కంపెనీల ఆదాయం మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో ధరలు తగ్గించాలని కంపెనీలకు కేంద్రం సూచన చేయనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత ముడిచమురు ధరలు, ఉత్పత్తి ఆధారంగా ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్పై రూ.4-5 తగ్గింపు ప్రకటించే అవకాశం ఉన్నదని జేఎం ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నివేదికలో పేర్కొన్నది.
ముడి చమురు ధరలు పెరిగినా..!
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల వాల్యుయేషన్లు సహేతుకంగా ఉన్నప్పటికీ, ఇంధన మార్కెటింగ్ వ్యాపారంలో ఆదాయంపై అస్థిరత ఉన్నదని, వచ్చే 9-12 నెలల కాలంలో ఒపెక్ ప్లస్ క్రూడాయిల్ ధరలను పెంచే రిస్క్ ఉన్నదని జేఎం తన పరిశోధనలో పేర్కొన్నది. క్రూడాయిల్ ధర బ్యారెల్కు 80 డాలర్ల కంటే తక్కువగా ఉండటం, ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఆధారంగానే ఓఎంసీల చర్యలు ఉండే అవకాశం ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.