Mahavikas Aghadi | ముంబై, మార్చి 27: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో విభేదాలు వీధికెక్కాయి. ఒక పక్క ఆ కూటమిలో భాగస్వామి అయిన వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) సొంతంగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించగా, మరో పక్క చర్చలు జరుగుతుండగానే శివసేవ (యూబీటీ) తన పార్టీ అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేసింది. ముంబైలోని నాలుగు సీట్లకు శివసేన (యూబీటీ) తన అభ్యర్థులను ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై వాయువ్య సీటును కేటాయించిన అమోల్ కృతికర్ను ‘కిచిడీ చోర్’ అంటూ విమర్శించారు. పొత్తు ధర్మాన్ని శివసేన విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శివసేన ఒక కిచిడీ చోర్కు టిక్కెట్ను కేటాయించింది. అలాంటి కిచిడీ చోర్ అభ్యర్థులకు మేము ఎంతమాత్రం పనిచేయబోం’ అని ఆయన తెగేసి చెప్పారు. కాగా, ఎంపీ గజానన్ కృతికర్ కుమారుడైన అమోల్ కృతికర్ కొవిడ్-19 సమయంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీలో అక్రమాలకు పాల్పడిన కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.
మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి కూటమికి కూటమిలో మరో భాగస్వామి అయిన వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) మిగిలిన పార్టీలకు షాకిస్తూ ఈ లోక్సభ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ ఐదుగురు అభ్యర్థుల మొదటి లిస్టును సైతం విడుదల చేశారు.