న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ఆరో దశ పోలింగ్ శనివారం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 34.37 శాతం ఓటింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 54.80 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. అలాగే బెంగాల్లోని ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఘటల్, కంఠిలో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఘటల్లో టీఎంసీ గూండాలు ఓటింగ్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టిస్తున్నారని బీజేపీ అభ్యర్థి హిరాన్ ఛటర్జీ ఆరోపించారు.
కాగా, ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 11 కోట్ల మంది ఓటర్లు నిర్ణయిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గౌతమ్ గంభీర్, ధోనీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.