న్యూఢిల్లీ, మార్చి 16: ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఓటింగ్ వ్యవధి ఉంటుంది. 1951 – 52 ఎన్నికల తర్వాత ఎక్కువ రోజులు ఓటింగ్ వ్యవధి ఉన్న ఎన్నికలు ఇవే. 1951 – 52లో దాదాపు నాలుగు నెలల పాటు ఓటింగ్ వ్యవధి కొనసాగింది. ఏకంగా 68 విడతల్లో అప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇక, అతి తక్కువ ఓటింగ్ వ్యవధితో ఎన్నికలు పూర్తయ్యింది 1980 ఎన్నికల్లో. కేవలం నాలుగు రోజుల్లో అప్పుడు ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఫలితాలు వచ్చేశాయి.
ఈసారి ఏడు విడతల్లో ఎన్నికలు జరపడం వల్ల పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీలకు నష్టం జరుగుతుందనే ఆరోపణను సీఈసీ రాజీవ్ కుమార్ కొట్టిపారేశారు. ఎవరికో అనుకూలంగా, ఇంకెవరికో ప్రతికూలంగా ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మన దేశ భౌగోళిక పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.