న్యూఢిల్లీ, డిసెంబర్ 21: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో దుండగుల అలజడి.. అసాధారణ రీతిలో 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. తదితర పరిణామాల మధ్య షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. చివరి రోజు లోక్సభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. విపక్ష ఎంపీల గైర్హాజరీలో పలు కీలక బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకున్నది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో తీసుకొచ్చిన 3 నేర న్యాయబిల్లులు, టెలికం బిల్లు, సీఈసీ, ఈసీ నియామకాలకు సంబంధించిన బిల్లులు ఈ జాబితాలో ఉన్నాయి.
పార్లమెంట్లో విపక్షాల గొంతును మోదీ సర్కార్ అణచివేస్తున్నదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్కు పాదయాత్రను చేపట్టారు. సేవ్ డెమొక్రసీ, పార్లమెంట్ కేజ్డ్, డెమొక్రసీ ఎక్స్పెల్డ్.. సందేశాల్ని చూపుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ, ‘భద్రతా వైఫల్యం అంశాన్ని సభలో లేవనెత్తకుండా ప్రధాని మోదీ విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కుల్ని కాలరాశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడకుండా ప్రధాని మోదీ, అమిత్ షాలు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. సభలో ప్రధాని మాట్లాడకపోవటం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టేనని ఖర్గే అన్నారు. శుక్రవారం జంతర్మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది.
ఉభయ సభల్లో 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం.. పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకున్నది. లోక్సభ ఇప్పటికే ఆమోదించిన భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్షా మాట్లాడుతూ.. ఈ బిల్లుల ద్వారా బాధితులకు మూడేండ్లలోగా న్యాయం దక్కుతుందని చెప్పారు. మరోవైపు, జాతీయ భద్రత పేరుతో ఏ మొబైల్ నెట్వర్క్ను అయినా టేకోవర్ చేసుకునేందుకు లేదా సస్పెండ్ చేసేందుకు కేంద్రానికి అధికారం కల్పించే టెలికమ్యూనికేషన్ బిల్లుకు కూడా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. అలాగే సీఈసీ, ఈసీల నియామక ప్యానల్ నుంచి సీజేఐని తొలగించే బిల్లుకూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఈ నెల 4న శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 13న ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకి, పొగ వదిలి అలజడి సృష్టించడం కలకలం రేపింది. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభ నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంటూ కేంద్రం ఏకంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసింది.