న్యూఢిల్లీ: అదానీ స్టాక్ వివాదంపై ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ కంపెనీ తమ స్టాక్స్తో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. హిండెబన్బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా .. ఆ అంశంపై విచారణ చేపట్టాలని ఇవాళ విపక్షాలు లోక్సభ, రాజ్యసభల్లోనూ డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి అదానీ అంశంపై చర్చించాలని కోరాయి.
అయితే రెండు సభలను తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక రెండు గంటలకు సమావేశం అయిన తర్వాత కూడా ఉభయసభల్లో అదే సీన్ రిపీటైంది. విపక్షాలు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలను రేపటికి వాయిదా వేశారు.
లోక్సభలో ఉదయం స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయగా.. మధ్యాహ్నం చైర్లో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. హౌజ్లో పార్లమెంటరీ పత్రాలను సమర్పించాలని మంత్రి జోషిని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడాలంటూ మంత్రి విపక్షాలకు సూచించారు. కానీ విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. ఆ గందరగోళంలో సభను వాయిదా వేశారు.