ముంబై : కరోనా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఐదు దశల్లో చేపట్టే అన్ లాక్ ప్రక్రియను ప్రకటించింది. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో 18 జిల్లాల్లో ఈనెల 4 నుంచి లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేయనున్నట్టు తెలిపింది. జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ పరిస్థితి ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనుంది.
తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాల్లో నియంత్రణలను ఎత్తివేస్తామని మంత్రి విజయ్ వడెతివార్ పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో తాజాగా 15,169 పాజిటివ్ కేసులు నమోదవగా రికవరీ రేటు 94.54 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.67 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.