న్యూఢిల్లీ, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) లేదా వాటి స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీలు) సమీకరించే రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం లోక్సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రభుత్వ బడ్జెట్ల నుంచి చెల్లింపులు జరపాల్సిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వ రంగ కంపెనీలు, ఎస్పీవీలు తాజా రుణాలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికి వచ్చిందని, ఇటువంటి రుణాలతో రాష్ర్టాల నికర రుణ సేకరణ పరిమితి మించి పోతుందని ఈ ఏడాది మార్చిలోనే రాష్ర్టాలకు తెలియపర్చినట్టు వివరించారు. రాష్ర్టాల వారీగా చేసిన అప్పులు, అప్పుల నియంత్రణకు కేంద్రం తీసుకొన్న చర్యలను వెల్లడించాలని లోక్సభలో ఎంపీ కిషన్ కపూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీతారామన్ పై వివరణ ఇచ్చారు. అలాగే స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2021-22 పేరిట ఆర్బీఐ రూపొందించిన నివేదికలోని అంశాలను ఈ సందర్భంగా వివరించారు.
టాప్టెన్లో ఐదు బీజేపీ పాలిత రాష్ర్టాలే
ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పు చేసిన రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. టాప్ 10 రాష్ర్టాల్లో ఐదు బీజేపీ పాలిత రాష్ర్టాలే ఉండటం గమనార్హం. తెలంగాణ రూ. 3.12 లక్షల కోట్లతో 11వ స్థానంలో ఉన్నది.