విశాఖపట్నం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా అంతా మహిళా సిబ్బందితోనే ఓ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నది. లోకోపైలట్ నుంచి మొత్తం రైల్వే సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ఒడిశాలోని రాయగడ (Rayagada) వెళ్తున్నది. ఈ రైలుకు ఈస్ట్కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ECoRWWO) ప్రెసిడెంట్ పారిజాత సత్పతి విశాఖపట్నంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూడా అంతా మహిళా అధికారులే హాజరుకావడం విశేషం.
వాల్తేరు డివిజన్లో మహిళలతో కూడిన ఓ బృందం లోకో షెడ్ను నిర్వహిస్తున్నది. మేరీ సహేళి పేరుతో రైళ్లలో, రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా, విశాఖపట్నం రైల్వేస్టేషన్ను నేడు అంతా మహిళా సిబ్బందే నిర్వహించనున్నారు. లోకోపైలట్లు, అసిస్టెంట్ లోకోపైలట్లు, భద్రతా సిబ్బంది, టికెట్ కలెక్టర్లు, ట్రెయిన్ మేనేజర్, టికెట్ చెకింగ్ స్టాఫ్ ఇలా అంతా మహిళలే ఉన్నారు.