పట్నా: బీహార్లో ఎల్జేపీ చీలిక వర్గాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఎల్జేపీ రాంవిలాస్ వర్గం అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరడం, తన బాబాయ్ పశుపతి పరాస్ సిట్టింగ్ స్థానమైన హజీపూర్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించడం తాజా వివాదానికి కారణమైంది. ఇప్పుడు పార్టీ చీలిక వర్గాలు రెండూ ఎన్డీఏ కూటమిలోనే ఉండటంతో భవిష్యత్తులో వీరి రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయోననే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
వివరాల్లోకి వెళ్తే.. దివంగత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (LJP) 2021లో ఆయన మరణానంతరం రెండు ముక్కలైంది. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడికి, తమ్ముడికి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ పార్టీని చీల్చాడు. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల్లో నలుగురిని తనవైపు తిప్పుకున్నారు. అనంతరం తనను తాను ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
మరోవైపు తనదే అసలైన ఎల్జేపీ తమదేనని రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ వర్గంలో చిరాగ్ పాశ్వాన్ ఒక్కడే ఎంపీగా ఉన్నాడు. ఇదిలావుంటే ఎల్జేపీని చీల్చిన పశుపతి పరాస్ను బీజేపీ కేంద్ర క్యాబినెట్లో చేర్చుకుని పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించింది. దాంతో చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాడు.
ఈ నేపథ్యంలో అతను సోమవారం తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. ఈ మేరకు జేపీ నడ్డాను కలిసి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన తండ్రి పార్లమెంటరీ నియోజకవర్గమైన హజీపూర్ నుంచి పోటీచేస్తామని చిరాగ్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం చిరాగ్ పినతండ్రి అయిన పశుపతి పరాస్ హజీపూర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
దాంతో చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలను పరాస్ ముందు ప్రస్తావించగా అవన్నీ ఉత్తమాటలని కొట్టిపారేశారు. నా నియోజకవర్గ ప్రజలను చిరాగ్ పాశ్వాన్ మభ్యపెట్టలేడని వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గంలో తన అభ్యర్థిని నాపై పోటీ పెట్టి గెలువడం చిరాగ్కు అసాధ్యమని పేర్కొన్నాడు.