అహ్మదాబాద్: హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి లారీకి మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణించిన భార్యాభర్తలు, ఆరేళ్ల కుమార్తె సజీవ దహనమయ్యారు. (charred to death) ఆ లారీలో రవాణా చేస్తున్న మేకలు, గొర్రెలు కూడా కాలిపోయాయి. గుజరాత్లోని అర్వల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్కు చెందిన ఒక కుటుంబం సుమారు 150 మేకలు, గొర్రెలను ఒక లారీలో రవాణా చేస్తూ అందులో ప్రయాణించారు. గుజరాత్లోని బమన్వాడ గ్రామానికి వెళ్తుండగా సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆ లారీకి హెటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో మంటలు రాజుకోవడంతో లారీ కాలిపోయింది. అందులో ఉన్న భార్యాభర్తలు, వారి ఆరేళ్ల కుమార్తె సజీవ దహనమయ్యారు. 150 జీవాలు కూడా కాలి మరణించాయి.
కాగా, ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ లారీని మేత భూమి వైపు తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. సజీవ దహనమైన దంపతుల వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మృతులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని వెల్లడించారు.