Wrestlers protest | న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ రెజ్లర్ల ఆందోళన బుధవారం కొనసాగింది. రాజధానిలో రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా.. ప్రధాని మోదీ స్పందించకపోవడంపై ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని మాటలు చెప్పే ప్రధాని ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘మన్ కీ బాత్ అంటూ మాట్లాడే మీరు మా మన్ కీ బాత్ కూడా వినండి మోదీజీ’ అంటూ రెజ్లర్లు తమ ఆవేదన వెలిబుచ్చారు.
‘మీ పార్టీ(బీజేపీ) ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపులపై ఆరోపణలపై మీతో చర్చించేందుకు కొంత సమయం కేటాయించండి’ అని కోరారు. ‘మేం దేశానికి మెడల్స్ సాధించినప్పుడు ఇంటికి ఆహ్వానించి సన్మానాలు చేసి, ఫొటోలు దిగారు. మీరు నా కూతుళ్లు అంటూ పిలిచారే.. ఇప్పుడు న్యాయం కోసం మేం చేస్తున్న ఆందోళనలు మీ కండ్లకు కనిపించడం లేదా?’ అని రెజ్లర్లు మండిపడ్డారు. కాగా బ్రిజ్ భూషణ్పై కేసు నమోదుకు కొంత ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం కోర్టుకు తెలిపారు. ఈ స్పందనను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. ఈ నెల 28న విచారణ జరిగే రోజున ఢిల్లీ పోలీసులు తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. బాధిత రెజ్లర్లు వేసిన పిటిషన్పై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరుపనున్నది.
బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలి: తమ్మినేని
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.