బెంగళూర్ : కర్నాటకలోని బెలగావి జిల్లాలో లింగాయత్ మఠాధిపతి బసవ సిద్ధలింగ స్వామి బలవన్మరణానికి పాల్పడ్డారు. మఠంలోని తన క్వార్టర్స్లో సోమవారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. ఉరి వేసుకుని సిద్ధలింగ స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్ధలంలో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆయన మరణానికి గల కారణాలేంటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్లో సిద్ధలింగ స్వామి ఏయే అంశాలను ప్రస్తావించారనే వివరాలు వెల్లడికాలేదు. కర్నాటకలోని మఠాల్లో లైంగిక వేధింపులపై వెలుగుచూసిన ఆడియో క్లిప్పై సిద్ధలింగ స్వామి నిర్వేదానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఆడియోలో మరణించిన స్వామీజీ పేరును కూడా ఆ ఆడియో క్లిప్లో ఇద్దరు మహిళలు ప్రస్తావించారు. ఇక లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు కలకలం రేపిన నేపధ్యంలో తాజా ఉదంతం చోటుచేసుకుంది. శివమూర్తి మురుగపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.