యూపీలో లైన్మెన్పై అధికారి వేధింపులు
మనస్తాపంతో ఉద్యోగి బలవన్మరణం
లక్నో, ఏప్రిల్ 12: ‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్లో చోటుచేసుకుంది. 45 ఏండ్ల గోకుల్ ప్రసాద్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. కొద్ది కాలంగా జూనియర్ ఇంజనీర్, అతడి సహాయకుడు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. లఖీంపూర్లోని జూనియర్ ఇంజినీర్ కార్యాలయం ఎదుటే ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీశారు. వెంటనే అతడిని దవాఖానకు తీసుకెళ్లినా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.
గోకుల్ భార్య ఓ వీడియోలో మాట్లాడుతూ.. మూడేండ్లుగా తన భర్తను వేధిస్తున్నారని, డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని, అందుకు మందులు కూడా వాడుతున్నాడని తెలిపింది. ఇంటికి దూరంలోని అలీగంజ్కు ఆ అధికారి బదిలీ చేశాడని, రోజూ అంతదూరం ప్రయాణం చేయలేక, ఇంటికి దగ్గరగా బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నాడని పేర్కొంది. బదిలీ కావాలంటే తనను ఒక్క రోజు వారి వద్దకు పంపాలని అడిగారని, దీంతో మనస్తాపం చెందిన తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది. తన భర్త నిప్పంటించుకుంటుండగా జూనియర్ ఇంజినీర్ అక్కడే చూస్తూ ఉన్నాడని, ఎవరూ సాయం చేయలేదని ఆరోపించింది. జూనియర్ ఇంజినీర్ను అధికారులు సస్పెండ్ చేశారు.