తిరువనంతపురం: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్రం వైఖరిని కేరళ సీఎం విజయన్(Kerala CM Vijayan) తప్పుపట్టారు. మతం, ప్రభుత్వం మధ్య గీ రోజు రోజుకు సన్నగిల్లుతున్నదని విమర్శించారు. అయోధ్యలో ప్రధాని మోదీ ఆలయ ప్రారంభత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే కేరళ సీఎం విమర్శలు గుప్పించారు. ఒక మతపరమైన ఆరాధన క్షేత్రాన్ని ప్రారంభించి, దాన్ని జాతీయ పండుగగా సెలబ్రేట్ చేయడం తగదు అని విజయన్ పేర్కొన్నారు. రాజ్యాంగబద్దమైన వ్యక్తులు ఇలాంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని, ఎందుకంటే సెక్యూలర్ భావనను దెబ్బతీసే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
సెక్యులరిజం అంటే మతం, ప్రభుత్వాన్ని వేరుగా చూడడమే అని భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన విషయాలను సీఎం విజయన్ గుర్తు చేశారు. ఇన్నాళ్ల వరకు ఆ సంప్రదాయాన్ని బలంగా పాటించామని, కానీ ఇప్పుడు మతం, ప్రభుత్వం మధ్య ఉన్న సన్నని గీత మరింత సన్నగా మారుతోందన్నారు. అందుకే రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి తమ మతాన్ని ప్రచారాం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒక మతాన్ని గొప్పగా చిత్రీకరించి, ఇతర మతాలను తక్కువగా చూపలేమన్నారు.
స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి భారత గణతంత్రంలో సెక్యులరిజం ఆత్మగా ఉందన్నారు. భిన్న మతాలకు చెందిన వాళ్లు, ఏ మతానికి సంబంధం లేని వాళ్లు కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నట్లు చెప్పారు. మతం అనేది వ్యక్తిగతమైన అంశమని, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు అన్నారు. శాస్త్రీ య విధానం, మానవత్వం, సంస్కరణలు వర్ధిల్లాలని ఆశిస్తున్నట్లు సీఎం విజయన్ తెలిపారు.