న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదని చెప్పేందుకు మనం సిగ్గుపడటం లేదని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. ‘జెస్సికాను ఎవరూ చంపనట్లే, బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అయోధ్య తీర్పుపై రాసిన ‘సన్రైజ్ ఓవర్ అయోధ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడారు. 1992 డిసెంబర్ 6న ఏమి జరిగిందో అది చాలా తప్పని, అది మన రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఊహించని రీతిలో సంఘటనలు జరిగాయన్నారు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో నిందితులంతా నిర్దోషులుగా విడుదలయ్యారని విమర్శించారు. ‘కాబట్టి జెస్సికాను ఎవరూ చంపలేదు, బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు’ అని ఎద్దేవా చేశారు.
అయితే, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం ఉన్న ఈ దేశంలో.. ఈ ముగింపు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని అని చిదంబరం అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదని చెప్పడానికి మనం సిగ్గుపడడం లేదన్నారు.
అయోధ్య తీర్పును ఇరుపక్షాలు అంగీకరించాయని చిదంబరం గుర్తు చేశారు. ఇరుపక్షాలు తీర్పును అంగీకరించినందున ఇది సరైన తీర్పుగా మారిందని, అంతే తప్ప మరో మార్గం కాదన్నారు. అయితే ఇరుపక్షాలు అంగీకరించినందున ఈ తీర్పు సరైనది కాదన్నారు.