న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రూట్లోనే ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ ముందు హాజరుకాబోనన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ జస్టిస్ స్వరణ కాంతకు లేఖ రాశారు. జస్టిస్ స్వరణ శర్మ కోర్టులో ఈ కేసు ముందు హాజరాకాబోనని కేజ్రీవాల్ సోమవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ ఆయన హాజరుకాబోనన్నారు. అయితే అదే తరహాలో ఇవాళ సిసోడియా కూడా లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని సిసోడియా పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియపై తనకు నమ్మకం లేదన్నారు.
ఇంకా ఆయన తన లేఖలో తీవ్ర విమర్శలు కూడా చేశారు. మీ పిల్లల భవిష్యత్తు తుషార్ మెహతా చేతుల్లో ఉందని సిసోడియా వ్యాఖ్యలు చేశారు. సిసోడియా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థతో పాటు రాజకీయా విభాగాల్లోనే తీవ్ర చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. తన కేసులో న్యాయవాదిని పెట్టుకోను అని, సత్యాగ్రహ బాటలో నడవనున్నట్లు సిసోడియా పేర్కొన్నారు.